హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు జాతీయ స్థాయి ‘డిజిటల్ ఎక్సలెన్స్’ అవార్డు

విశాఖపట్నం, ఏప్రిల్ 25: భారత ప్రభుత్వ రంగ రక్షణ శాఖ పరిధిలోని ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) మరో జాతీయ స్థాయి గుర్తింపును సాధించింది. సముద్ర రంగంలో అద్భుతమైన డిజిటల్ పరివర్తనను (Digital Transformation) సాధించినందుకు గాను హెచ్‌ఎస్‌ఎల్‌కు ప్రతిష్టాత్మకమైన ‘పిఎస్‌ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’ లభించింది.



శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో, 30కి పైగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల (PSEs) మధ్య పోటీ నెలకొనగా.. డిజిటల్ విభాగంలో హెచ్‌ఎస్‌ఎల్ అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ తరఫున డిజిఎం (IT & ERP) టి.వి.ఎన్.బి. సూర్యనారాయణ ఈ అవార్డును స్వీకరించారు.



సాంకేతిక విప్లవంతో మెరుగైన పనితీరు:

సంస్థలోని అంతర్గత కార్యకలాపాలను ఆధునీకరించడంలో భాగంగా SAP S/4HANA సాఫ్ట్‌వేర్‌ను హెచ్‌ఎస్‌ఎల్ విజయవంతంగా అమలు చేసింది. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకమైన డిజిటల్ వ్యవస్థలు మరియు పనిలో వేగం పెంచడం వంటి అంశాలు ఈ అవార్డుకు ప్రధాన కారణమయ్యాయి.

నవ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా, సముద్ర రంగంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో హెచ్‌ఎస్‌ఎల్ ముందంజలో ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ విజయం సంస్థ యొక్క భవిష్యత్తు ప్రాజెక్టులకు మరింత ఊతాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.