విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు

 న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టులు వార్తలు లేదా కథనాలు రాశారనే కారణంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది.



రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేవలం ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్రభుత్వంపై విమర్శగా కనిపించిందనే కారణంతో అతనిపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని వ్యాఖ్యానించింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలోని అధికారుల నియామకాల్లో కుల సమీకరణాలపై ఆయన రాసిన కథనం నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

ఈ పిటిషన్‌ను జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వీ.ఎన్‌. భట్టితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ.. సంబంధిత కథనానికి సంబంధించి ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

“ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి. కేవలం జర్నలిస్టు రచన ప్రభుత్వంపై విమర్శగా భావించబడిందనే కారణంతో క్రిమినల్‌ కేసులు పెట్టకూడదు” అని ధర్మాసనం పేర్కొంది.