అవినీతి రహిత కోవూరుకు అందరూ కలిసి రండి

అవినీతి రహిత కోవూరుకు అందరూ భాగస్వాములై కలిసి రండి... కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. 



ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదల గడప దాకా చేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలదే....ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.



పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం  కొడవ లూరు మండలం కమ్మ పాలెం గ్రామంలో బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో 1500 కు పైగా వైసిపి నాయకులు కార్యకర్తలు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాళెం గ్రామం చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. నాయకులు బెల్లం వెంకయ్య నాయుడు, గరిక మస్తానయ్య, పెమ్మా రెడ్డి పాళెం ఎంపీటీసీ ఉరుటూరు శేషమ్మ, కమ్మపాళెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య, రెడ్డిపాళెం కు చెందిన వైసిపి నాయకులు నీలకంఠం శ్రీధర్ రెడ్డి, కమ్మపాళెం ఎంపీటీసీ  అరుణకుమారి, రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు తదితర నాయకులకు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.




ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నీతిపరులు వైసిపిలో వుండలేరన్నారు. దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఅభివృద్ధికి మారు పేరని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అభివృద్ధి చేయగల సమర్ధత చంద్రబాబు నాయుడుకే వుందన్నారు. చంద్రబాబు నాయుడు  సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట వ్యాప్తంగా ప్రజలు టిడిపి వైపు చూస్తున్నారన్నారు. పాత కొత్త నాయకుల మధ్య సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. 



అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియచేసారు. ప్రజలుకు, ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా వుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తన పట్ల నమ్మకం వుంచి తన వెంట రాజకీయ ప్రయాణం చేస్తున్న నాయకులకు అండగా వుంటానన్నారు. గతంలో కోవూరులో కేవలం నలుగురు మాత్రమే అధికారం చెలాయించారని తన హయాంలో ప్రతి గ్రామ నాయకుడు నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునే స్వేచ ఉందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో మమేకమై పని చేసే నాయకులకు తాను అండగా వుంటానన్నారు. తన  ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరు నినాదంలో నాయకులు భాగస్వాములు కావాలని కోరారు. సహజ వనరులు, ఇఫ్కో, మిధాని లాంటి పారిశ్రామిక సంస్థలున్న కొడవలూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వైసిపి నుంచి టిడిపిలోకి చేరిన బెల్లం కొండయ్య మాట్లాడుతూ తాను ఎన్నికలలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సహకరించక తప్పు చేశానని తనను క్షమించాలని కోరారు. తన జీవితాంతం ప్రజలకు నిస్వార్ధ సేవ చేస్తున్న వేమిరెడ్డి అడుగు జాడల్లో నడుస్తానన్నారు. టిడిపిలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలు, వేమిరెడ్డి దంపతుల నిస్వార్ధ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై టిడిపిలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. 



ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చిరెడ్డి పాళెం టిడిపి అర్బన్,రూరల్ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, విడవలూరు టిడిపి మండల అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ  ఛైర్మెన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.