చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది...
స్వర్ణ వానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు...
రూ.10కోట్లతో వానపల్లిలో 72 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...
రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం వానపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రూ.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు ఆర్డీఎస్ స్కీం ద్వారా వానపల్లి గ్రామానికి 24 గంటలు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించే రూ.3కోట్ల 50 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి తదితరులతో కల్సి ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధికి అంతం లేదని, ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని ఎమ్మెల్యే బండారు అన్నారు. వానపల్లిలో రూ.8.32కోట్లతో 45పనులు, 27 పనులు రూ.1.73కోట్లతో పనులకు ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు.వానపల్లి పంచాయతీకి ఒకనాడు కారు కూడా రాలేని విధంగా రహదారులు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి నుంచి స్వర్ణ వానపల్లిగా తీర్చిదిద్దామన్నారు. నాడు స్వర్ణ వానపల్లి సభ కోసం వానపల్లికి ముఖ్యమంత్రి వస్తారని ప్రోగ్రాం పిక్స్ అయిందని, అయితే వాతావరణం అననుకూలంగా ఉండటంతో ప్రోగ్రాం జరుగుతుందో లేదో అనుకున్నామని, అయితే ముఖ్యమంత్రి నేను వానపల్లి వస్తాను, ప్రజలు కల్సుకుంటానని ధృడ దీక్షతో వచ్చారని, ఇక్కడ జరిగిన సభలో పాల్గొన్నారని నాటి సంగతులు ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. వానపల్లి అభివృద్ధికి వరాలు ఇచ్చి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు అనేక పనులు చేపట్టామన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నారు. వానపల్లిలో ముఖ్యమంత్రి చెప్పిన పనులు ఇంకా ఉన్నాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని, కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయన్నారు. విద్యాశాఖామంత్రి నారాలోకేష్ ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు మొదలైన పథకాలతో పేద విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయం చేస్తున్నారన్నారు. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. చక్కటి ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

